సూర్యుని తొలికిరణాలకు వెలుగులు ప్రారంభించి, సమయంతో పెరిగే సూర్య కిరణాలకు తగిన రీతిలో వెలుగులను విరజిమ్మే ఆ శిఖరాలను దర్శించి అన్నపూర్ణ మాతకు నమస్కారం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ ప్రదేశంలోని మిగిలిన ఆకర్షణలవైపు కళ్లు తిప్పగలం.ఇక్కడికి సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవల్లో విహరించ వచ్చు. ఎవరికివారు నడుపు కుంటూ వెళ్లేందుకు వీలున్న పడవలున్నాయి. పర్వతాల మధ్య ఉన్న ఆ సరస్సులో ప్రశాంత జలాలమీద నెమ్మదిగా సాగే పడవ ప్రయాణం ఎంతో బావుంటుంది. సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ పర్వత సముదాయాన్ని తిలకించిన వారికి సూర్యాస్తమయ సమయంలో ఆ పర్వతాలు ఎలా కనిపిస్తాయో కదా అనే సందేహం కలుగుతుంది. ఆ మధురమైన అనుభవం కోసం శాంతి శిఖరం మీదికి వెళ్లి తీరాల్సిందే.
ప్రపంచశాంతి కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచులో ఉంటుంది. అక్కడ నిలబడి పడమరగా తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లుగా ఉండదు. ఈ అందమైన ప్రకృతిని పగలంతా కాంచినా తనివితీరని సూర్యుడు దిగాలుగా వెళ్లలేక వెళుతున్నాడా అనిపిస్తుంది. నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి దిగుతుంటే పర్వత చాయలు లోయలంతా కప్పుతాయి. అంతవరకు ఒక వెలుగు వెలిగిన ఆ ప్రాంతమంతా హఠాత్తుగా మేఘాలు కమ్మినట్టయి చీకటిగా అవుతుంది. పక్షులు అరుపులు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ మార్పును చూస్తూ పర్యాటకులు మౌనంలోకి వెళతారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.
No comments:
Post a Comment